స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకానికి జగన్ లేఖలు: పట్టాభిరామ్ ఆరోపణ

  • విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దెబ్బతీయడంలో జగన్ పాత్రపై టీడీపీ ఆరోపణ
  • ప్లాంట్ భూములు అమ్మి నిధులు సమీకరించాలని కేంద్రానికి జగన్ లేఖలు రాశారన్న పట్టాభి
  • ఉక్కు గనుల లీజులను పునరుద్ధరించకుండా అడ్డుకున్నారని విమర్శ
  • జగన్ హయాంలో ఉత్పత్తి తగ్గి, ఉద్యోగుల సంఖ్య పడిపోయిందని ఆరోపణ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ భూముల్లో లేఅవుట్లు వేసి విక్రయించాలని, కీలకమైన గనుల లీజులను పునరుద్ధరించకుండా అడ్డుకోవాలని జగన్ కేంద్రానికి లేఖలు రాశారని, ఇటువంటి చర్యల వల్లే ప్లాంట్ ఆర్థికంగా కుదేలైందని ఆయన విమర్శించారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్‌కు చెందిన వేలాది ఎకరాల భూములను విక్రయించి, ఆ నిధులతో ప్లాంట్‌ను బలోపేతం చేయాలని జగన్ కేంద్రానికి ప్రతిపాదించారని ఆరోపిస్తూ, అందుకు సంబంధించిన పత్రాలను ఆయన మీడియాకు ప్రదర్శించారు.

జగన్ ప్రభుత్వ హయాంలో (2019-2024) ప్లాంట్‌కు అనుబంధంగా ఉన్న విజయనగరం జిల్లాలోని మాంగనీస్, సిలికా గనుల లీజులను ఉద్దేశపూర్వకంగానే పునరుద్ధరించలేదని పట్టాభి ధ్వజమెత్తారు. వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. దీనివల్ల ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యం 25 శాతం పడిపోయిందని, ఉద్యోగుల సంఖ్య కూడా 2020లో 17,000 ఉండగా, 2023 నాటికి 14,800కి తగ్గిపోయిందని వివరించారు.

అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గనుల లీజులను పొడిగించిందని, తద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని 90 శాతానికి పైగా పునరుద్ధరించిందని పట్టాభి తెలిపారు. ప్రభుత్వ చొరవ ఫలితంగా ప్లాంట్ సుమారు రూ. 54 కోట్ల లాభాన్ని నమోదు చేసిందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటానని జగన్ చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని, ఆయన గతంలో కేంద్రానికి రాసిన లేఖలే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు.                                

YS Jagan Mohan Reddy
Visakhapatnam Steel Plant
Kommareddy Pattabhiram
Vizag Steel land sale
Andhra Pradesh politics
TDP vs YSRCP

More Telugu News